Pawan Kalyan | పదేళ్ల కింద ముంబైలో ఒక సునామీ వచ్చింది.. కానీ దాని తర్వాత వాడొచ్చాడు.. వాడు సృష్టించిన రక్తపాతాన్ని ఇంతవరకు ఏ సునామీ కూడా చెరపలేకపోయింది అంటూ ఓజీ టీజర్లో ఒక ఖతర్నాక్ డైలాగ్ పెట్టాడు దర్శకుడు సుజిత్. ఇప్పుడు దీన్ని మనం కాస్త మార్చి చదువుకుందాం.. 10 సంవత్సరాల కింద తెలుగు ఇండస్ట్రీలో ఒక సునామీ వచ్చింది. ఆ సునామీ పేరు అత్తారింటికి దారేది.. సాధారణంగా ఏదైనా సినిమా విడుదలకు ముందే సగం సినిమా సోషల్ మీడియాలో లీక్ అయితే.. నిర్మాత గుండె మామూలు కంటే 1000 రెట్లు వేగంగా కొట్టుకుంటుంది.. కానీ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి.. ఆ నిర్మాత నిశ్చింతగా ఉన్నాడు. సినిమా కూడా సేఫ్ అయింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన అత్తారింటికి దారేది.. 2013లోనే దాదాపు 83 కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సరిగ్గా పదేండ్ల తర్వాత మళ్లీ అదే డేట్కు ఓజీ సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 27న ఓజీ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరో స్థాయిలో పెంచేసింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా ఏప్రిల్ తర్వాత ఆయన అక్కడి నుంచి కాస్త ఫ్రీ అవుతాడు.
ఎన్నికల తర్వాత ఫలితంతో సంబంధం లేకుండా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఓజీ అన్నింటి కంటే ముందుంటుంది. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేశాడు సుజిత్. మరో 15 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తయిపోతుంది. అన్నట్టు ఓజీ రెండు భాగాలుగా రాబోతుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. రెండో భాగం 2025లో రానుంది.
గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్. ఇండస్ట్రీ రికార్డులు కదిలించిన అత్తారింటికి దారేది విడుదలైన రోజే ఓజీ సినిమాను కూడా విడుదల చేస్తుండడంతో.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి పవర్ స్టార్ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తాడని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. మరి వాళ్ల నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.