సినిమాలను వృత్తిగా ఎంచుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మార్పులొచ్చాయని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. చదువుకునే రోజుల్లో తనది అంతర్ముఖమైన మనస్తత్వమని..కెమెరా ముందుకొచ్చిన తర్వాతే మానసిక భయాలపై విజయం సాధించానని వివరించింది. ఆమె మాట్లాడుతూ ‘స్కూల్రోజుల్లో వేదిక ఎక్కాలంటే చాలా భయమేసేది. డ్యాన్స్ పర్ఫార్మ్ చేస్తున్న సమయంలో భయం వల్ల ఒక్కోసారి స్టెప్స్ కూడా మర్చిపోయేదాన్ని. అయితే మోడలింగ్ను కెరీర్గా ఎంచుకొని సినీరంగంలోకి ప్రవేశించిన తర్వాత క్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కెరీర్ తొలిరోజుల్లో కెమెరా ముందుకురాగానే కాస్త కంగారుగా అనిపించేది. అయితే వృత్తిలో రాణించాలంటే భయాల్ని జయించడం తప్ప మరో మార్గం లేదనిపించింది. అదే సమయంలో సినిమాలపై ఉన్న ప్రేమ నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలుగుతున్నా’ అని తెలిపింది. ‘ఆచార్య’ చిత్రంతో తాను నీలాంబరి అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తానని..అల్లరి, అమాయకత్వం కలబోసిన చక్కటి పాత్ర అదని చెప్పింది పూజాహెగ్డే.