విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 2’. ఈ చిత్ర తొలి భాగం ‘పొన్నియన్ సెల్వన్’ గతేడాది విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు రెండో భాగం పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. చారిత్రక కథాంశంతో దర్శకుడు మణిరత్నం రూపొందించారు. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ…‘ఈ చిత్ర తొలి భాగాన్ని విడుదల చేసి ఘన విజయాన్ని అందుకున్నాం. ఇప్పుడు ద్వితీయ చిత్రాన్ని కూడా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది. అందరికీ నచ్చే మల్టీస్టారర్ మూవీ అవుతుంది’ అన్నారు. దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ…“బాహుబలి’ రెండు భాగాల సినిమాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. గొప్ప టెక్నికల్ టీమ్, ఆర్టిస్టుల సహకారంతో ‘పొన్నియన్ సెల్వన్ 2’ను మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ..‘మణిరత్నం లాంటి జీనియస్ దర్శకుడితో పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయనతో ఎన్ని చిత్రాలకైనా పనిచేస్తాను. తెలుగు ప్రేక్షకులు మా చిత్రంపై ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. కార్తి మాట్లాడుతూ…‘తొలి భాగం వినోదాన్నిస్తూ సాగితే, ఈ రెండో సినిమా క్లాసిక్ మూవీ చూసిన అనుభూతినిస్తుంది. రెండు పార్ట్స్ కలిపే షూటింగ్ చేశాం’ అన్నారు. ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ…“ఇద్దరు’ చిత్రానికి మణిరత్నం గారితో పనిచేశాను. ఇప్పుడు ఈ సినిమాతో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఎంతో కష్టపడి పనిచేసినా ప్రతి క్షణం ఆస్వాదించాము’ అన్నారు. ఈ కార్యక్రమంలో జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, త్రిష తదితరులు పాల్గొన్నారు.