‘ఈ చిత్ర దర్శకుడు అనిల్ నాకు మంచి మిత్రుడు. అతను ఎంతటి ప్రతిభావంతుడో నాకు తెలుసు. ఓ బ్లాక్బస్టర్ సినిమా తీసి..దానికి సీక్వెల్ చేయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత సినిమాలాంటిది’ అన్నారు అడవి శేష్. ఆయన ముఖ్యఅతిథిగా ‘మా ఊరి పొలిమేర-2’ ప్రీరిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గౌరికృష్ణ నిర్మించారు. ఈ నెల 3న విడుదలకానుంది. వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త కంటెంట్ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాకు హిట్ కళ కనిపిస్తున్నది’ అన్నారు. విజయంపై టీమ్ అందరం నమ్మకంతో ఉన్నామని దర్శకుడు డా॥ అనిల్ విశ్వనాథ్, నిర్మాత గౌరికృష్ణ పేర్కొన్నారు. ఈ సినిమాకు టెక్నీషియన్సే హీరోలని సత్యం రాజేష్ అన్నారు.