Phule Trailer | భారతదేశ చరిత్రలోనే అగ్రవర్ణాల ఆధిపత్యానికి ఎదురునిలిచి, అణగారిన వర్గాల కోసం, మహిళా విద్య కోసం పోరాడిన విప్లవమూర్తులు మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రీబాయి ఫూలే. ఈ దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనంత్ నారాయణ్ మహాదేవన్ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘ఫూలే’. హిందీలో ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందిన ఈ బయోపిక్ను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు అఫీషియల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. సుపథ క్రియేషన్స్ మరియు జీ స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు.
ఈ ట్రైలర్ను గమనిస్తే.. 19వ శతాబ్దంలో సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్ష, అంటరానితనం మరియు మహిళలపై జరిగిన అణచివేతపై ఫూలే దంపతులు ఎలా తిరుగుబాటు చేశారనేది చాలా హృద్యంగా చూపించారు. “శూద్రులు కాదు.. దళితులు” అంటూ సాగే పవర్ఫుల్ డైలాగ్స్ ఈ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్క్యామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీ జ్యోతిరావు ఫూలే పాత్రలో పరకాయ ప్రవేశం చేయగా, పత్రలేఖ సావిత్రీబాయి ఫూలే పాత్రలో ఒదిగిపోయారు. విజువల్స్ మరియు ఆ కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా చేసిన మేకింగ్ ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సినిమాకు చేతన్ కాతి తెలుగు సంభాషణలు అందించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించారు. పూర్ణాచారి మరియు శ్రీదేవి రెడ్డి తాంగెళ్ల అందించిన సాహిత్యం పాజిటివ్ వైబ్స్ కలిగిస్తోంది. సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత మరియు అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా బాలికల కోసం దేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించిన ఈ దంపతుల అసాధారణ ప్రయాణం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.