Rakshit Shetty |కన్నడ హిట్ ‘సప్తసాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో విడుదల చేస్తున్నది. రక్షిత్శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఈ సినిమాకు హేమంత్ ఎం.రావు దర్శకుడు. ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రక్షిత్శెట్టి మాట్లాడుతూ ‘పాన్ ఇండియా సినిమాలు ప్రత్యేకంగా తీయాల్సిన పనిలేదు.
కొన్ని సినిమాలు వాటంతటవే పాన్ ఇండియా స్థాయికి వెళతాయి. ఇది అలాంటి సినిమానే. ఇక్కడ కన్నడవెర్షన్ రెండు షోలతో విడుదల చేశాం. కొన్ని రోజుల్లోనే పదుల సంఖ్యలో షోలు పెరిగిపోయాయి. ఓ విధంగా విడుదలకు ముందే హిట్ అయిన సినిమా ఇది’ అని చెప్పారు. ఈ సినిమాకు తెలుగురాష్ర్టాల్లో అభిమానులున్నారనీ, అందుకే తెలుగులో విడుదల చేస్తున్నామని వివేక్ కూచిభొట్ల తెలిపారు.