ఏపీ ముఖ్యమంత్రి వైఎస్జగన్తో పవన్కల్యాణ్కు పోలికే లేదని అన్నారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. పవన్కల్యాణ్కు ఎక్కడ, ఎప్పుడు ప్రశ్నించాలో తెలియదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో సినీ పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పవన్కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఆయన మాటలపై సోమవారం పోసాని కృష్ణమురళి స్పందించారు. ప్రీ రిలీజ్ వేడుకలో పవన్కల్యాణ్ ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. పవన్కల్యాణ్ యాభై కోట్ల పారితోషికం తీసుకుంటూ పది కోట్లని అబద్ధమాడారని అన్నారు. వైఎస్ జగన్కు కులపిచ్చి ఎక్కువని అన్న పవన్కల్యాణ్ వాటికి ఆధారాలు చూపిస్తే బాగుంటుందని పోసాని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన అప్పులు, దళితులను ఆయన అవమానించిన ఘటనల గురించి పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చిరంజీవితో తనకు రాజకీయపరంగా అభిప్రాయభేదాలున్నా ఎప్పుడూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో పంజాబ్ అమ్మాయిని పేరున్న వ్యక్తి మోసం చేస్తే బాధితురాలికి న్యాయం చేయడానికి పవన్ ఎందుకు ముందుకు రాలేదన్నారు. ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన పవన్కల్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్కల్యాణ్ను ప్రశ్నిస్తున్నందుకు ఒకవేళ పరిశ్రమ తనను బ్యాన్ చేసినా భయపడనని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.