‘సినిమాకు రాజకీయ రంగు పూయడం మాకు ఇష్టంలేదు. దయచేసి చిత్రపరిశ్రమకు నేను చెప్పేది ఒక్కటే.. పరిశ్రమ సాధకబాధకాలు తెలిసినవాళ్లే మాట్లాడండి. అలాంటివారితోనే మా ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడటానికి నిర్మాతలు రండి. హీరోలొచ్చి నమస్కారాలు పెట్టాల్సిన పనిలేదు. నటరత్న ఎన్టీఆర్ ఔన్నత్యం మాలో ఉంది.. గర్తుంచుకోండి’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడారు. ‘అడగ్గానే టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. డిమాండ్ని బట్టి సైప్లె ఉంటుంది. శంకర్గారి సినిమాలను చెన్నైలో నేనే బ్లాక్లో కొని చూశా. తొలిరోజు టికెట్కి డిమాండ్ ఉంటుంది. మరోవైపు బడ్జెట్ పెరిగింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తం అయింది. టికెట్ రేట్లు పెంచితే తప్పేముంది? పెరిగిన ప్రతి రూపాయికీ 18శాతం జీయస్టీ కడుతున్నాం. ఊరకే ఇవ్వడంలేదు. దీనిపై తప్పుగా ప్రచారం చేస్తున్నారు. టికెట్ రేట్లు పెరిగితే ప్రభుత్వానికే ఆదాయం’ అని పవన్ తెలిపారు.
‘రామ్చరణ్ ఇంతపెద్ద నటుడు అవుతాడని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటాడనీ మేం ఎవరం ఊహించలేదు. మెగాస్టార్ కొడుకు గ్లోబల్స్టారే అవుతాడు అని నిరూపించాడు. శంకర్గారి సినిమాలను ఇష్టంగా చూసేవాడ్ని. ఈ రోజు రామ్చరణ్, తారక్, రాజమౌళి.. వీరంతా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారంటే దానికి కారకులైన దర్శకుల్లో శంకర్ ఒకరు. అంత గొప్ప దర్శకుడు.. ‘గేమ్ఛేంజర్’ని తెలుగులో తీయడం ఆనందించదగ్గ విషయం. ఇది సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని అర్థమవతుంది. సినిమా అంటే విలువలుండాలి. హీరోలు మంచి చెప్పాలి. బాధ్యతగా ఉండాలి. వినోదంతోపాటు ఆలోచింపజేసే సినిమాలు రావాలి. శంకర్ సినిమాలు అలాగే ఉంటాయి’ అని పవన్కల్యాణ్ అన్నారు.
తన ‘తొలిప్రేమ’ డిస్ట్రిబ్యూటరైన దిల్రాజు ఆ తర్వాత తన ‘వకీల్సాబ్’ నిర్మాతగా ఎదిగారని, నిర్మాతగా తనిచ్చిన డబ్బే తన జనసేన పార్టీకి ఇంధనమైందని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ‘పబ్లిక్ ఫంక్షన్ అంటే ఈ టైమ్లో పెట్టొచ్చా లేదా అని ఆలోచించా. మూడేళ్లు కష్టపడి సినిమా తీశారు. కోట్లు కుమ్మరించారు. అలాంటి సినిమాను బలంగా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఓకే చెప్పా. ఇప్పటికీ భయంగానే ఉంది. మీరంతా క్షేమంగా ఇంటికెళ్లాలి. ఆనందంగా చేసుకునే ఈ వేడుక విషాదం కాకూడదు. సినిమాను సినిమాగా చూడండి. ఇంట్లోవాళ్లను బాధపెట్టొద్దు’ అని పవన్కల్యాణ్ హితవు పలికారు. ఏపీ రాజకీయాలు మార్చిన గేమ్ఛేంజర్ పవన్కల్యాణ్గారు ఈ వేడుకకు రావడం మరిచిపోలేని అనుభవమని రామ్చరణ్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా దర్శకుడు శంకర్, దిల్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.