తాజా రాజకీయ ప్రసంగంలో తన పారితోషికం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటా అంటూ ఆయన చేసిన ప్రసంగం వీడియోను పెద్ద సంఖ్యలో నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఏపీలోని విజయవాడలో జరిగిన జనసేన వార్షికోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…‘డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నా అని కొందరు విమర్శలు చేస్తుంటారు. నాకు డబ్బుకు కొదవ లేదు. ప్రస్తుతం నేను నటిస్తున్న చిత్రంలో 22 రోజులు నటిస్తే 44 కోట్ల రూపాయలు తీసుకుంటున్నా. రోజుకు రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా. ప్రతి సినిమాకు ఇలా ఇస్తారని కాదు. సరాసరిన నా సంపాదన ఇది. మీరు అందిస్తున్న ఆదరణ వల్లే హీరోగా సినీ పరిశ్రమలో నాకు ఇంతటి స్థాయి వచ్చింది’ అని చెప్పారు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘ఉస్తాద్ భగత్సింగ్’, దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్), సాయి ధరమ్ తేజ్తో కలిసి ‘వినోదయ సితమ్’ రీమేక్లో నటిస్తున్నారు.