రామ్ చరణ్ అందుబాటులో లేకుంటే ‘ఆచార్య’ సినిమా సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించేవారు అని అన్నారు చిరంజీవి. రామ్ చరణ్తో కలిసి ఆయన నటించిన ఈ సినిమా ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, దర్శకుడు కొరటాల శివ పాల్గొన్నారు.
పవన్ నటించినా తేడా ఉండదు: చిరంజీవి
నా కెరీర్ ప్రారంభంలో రక్త సింధూరం అనే చిత్రంలో నక్సలైట్ పాత్రలో నటించా. మళ్లీ ఇన్నేళ్లకు ‘ఆచార్య’ చిత్రంలో ఆ పాత్రను పోషించే అవకాశం వచ్చింది. నా జీవితంలో ప్రతి రోజూ, ఎదురయ్యే ప్రతి మనిషి, ప్రతి సందర్భం ఏదో కొత్త విషయం నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే జీవితమే నాకు గురువుగా భావిస్తుంటా. నేను చరణ్ కలిసి నటించాలనే కోరికను ‘ఆచార్య’ తీర్చింది. తండ్రీ కొడుకులం కావడం వల్ల సిద్ధ పాత్రలో చరణ్ మరింత ఆకర్షణ తీసుకొచ్చాడు. ఒకవేళ తను అందుబాటులో లేకుంటే ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించినా అదే భావోద్వేగాలు పండేవి. రామ్ చరణ్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. సెట్లో నేను ఎలా వ్యవహరిస్తానో, ఇతర నటీనటులతో ఎంత స్నేహంగా ఉంటానో, దర్శకుడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తానో అలాగే చరణ్ ప్రవర్తిస్తుంటాడు.
నేను 1 నుంచి 150 సినిమాలు చేసుకుంటూ వస్తే చరణ్ నా 150 సినిమాలు చూసి అక్కడి నుంచి పైకి ఎదుగుతున్నాడు. దేవాలయం, నక్సలిజం అనే రెండు వేర్వేరు నేపథ్యాలను కథలో తీసుకున్నాం కానీ ఇందులో వాటి మంచి చెడులు ప్రస్తావించడం లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి అత్యధిక శాతం పన్ను వసూళ్లు జరుగుతున్నాయి. ఆ ఆదాయం నుంచే కష్ట కాలంలో మాకు కొంత తిరిగి ఇవ్వమని అడిగాం. కరోనా వల్ల కుదేలైన ఇండస్ట్రీ కోలుకోవాలంటే టికెట్ రేట్లు పెంచమని చెప్పాం. ఇందులో ఒకరి దగ్గర మేము అవమానపడింది లేదు.
ఈ సినిమా నాన్నదే : రామ్ చరణ్
ఈ సినిమా కథ విన్నప్పుడే సిద్ధ పాత్రలోకి వెంటనే వెళ్లిపోయాను. ఎలా నటించాలి అనేది దర్శకుడు చెప్పిన దాన్ని బట్టే నేర్చుకుంటా. ఈ పాత్రను కొరటాల శివ ఎంతో కాలంగా అర్థం చేసుకుని ఉన్నారు. కాబట్టి ఆయన మాటల ద్వారా మాత్రమే ఆ క్యారెక్టర్ను పూర్తిగా తెలుసుకోగలను అనుకున్నాను. రచనలో స్పష్టత ఉంటే నటుడికి పని సులువవుతుంది. నా విజయవంతమైన చిత్రాలన్నింటిలో ఈ విషయాన్ని అనుభూతి చెందాను. ఈ చిత్రంలో మరింత ఎక్కువగా అనిపించింది. నాన్న సమయపాలన పాటిస్తారు. టైమ్కు విలువ ఇస్తారు. హీరోలు సమయానికి వస్తే దర్శక నిర్మాతలకు ఎంత కలిసొస్తుందో చిరంజీవి గారికి తెలుసు. గొప్ప నటుడైనా పంక్చువాలిటీ లేకుంటే ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండలేరు. చెప్పాలంటే ఇది నాన్న సినిమా. నేను అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తాను.
తెరపై చిరంజీవి క్రేజ్ వేరు: దర్శకుడు కొరటాల శివ
ఈ సినిమా పూర్తిగా కల్పిత కథ. ఎక్కడ నుంచీ స్ఫూర్తి తీసుకున్నది కాదు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నటించినా తెరపై చిరంజీవి గారి క్రేజ్ వేరుగా ఉంటుంది.