Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స అనంతరం విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారు. గత కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తి చేయడంతో, క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈరోజు ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి తనకు డిశ్చార్జ్ లభించిందని, తమ హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయని అన్నా లెజినోవా పేర్కొన్నారు. తన భర్త ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఎంతో నైపుణ్యం, బాధ్యతతో ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందానికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆయన సురక్షితమైన చేతుల్లో ఉన్నారనే నమ్మకం తమ కుటుంబానికి ఎంతో విలువైన ప్రశాంతతను ఇచ్చిందని చెబుతూ.. చికిత్స అందించిన డాక్టర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. కేవలం వైద్య నైపుణ్యానికే కాకుండా, ఈ కష్ట సమయంలో వారు చూపించిన దయ, అంకితభావం మరియు మానవత్వానికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆమె ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ సర్జరీ విషయానికి వస్తే, ఆయన గత 2016 నుంచి భుజం నొప్పితో బాధపడుతున్నారు. ప్రజా క్షేత్రంలో నిరంతర పర్యటనలు, వారాహి యాత్రలు మరియు ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానులు ఆయన్ని లాగడం వల్ల కుడి భుజంలోని రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు చిన్న ఫ్రాక్చర్ కూడా ఉండటంతో ప్రముఖ క్రీడా వైద్య నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని బృందం సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటుండగా, వైద్యులు ఆయనకు 3 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. దీంతో జనసైనికులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.