Pandu Master | ప్రఖ్యాత డ్యాన్స్ షో ‘ఢీ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ పండు మాస్టర్ విశాఖపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా హిప్ జాయింట్ డిస్లొకేట్ కావడంతో పాటు మోకాళ్ల కింద భాగంలోని ఎముకలు, జాయింట్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. అన్ని వైద్య పరీక్షలు పూర్తిచేసిన అనంతరం ఒక సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.
హిప్ జాయింట్కు సంబంధించిన సమస్యను తొలి ఆపరేషన్ ద్వారా పరిష్కరించామని, మిగిలిన గాయాలకు సంబంధించి మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాద సమయంలో తలకు కూడా గాయం అయినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పండు మాస్టర్ అభిమానులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసిన అంశం ఆయన భవిష్యత్తులో మళ్లీ డ్యాన్స్ చేయగలరా అనే ప్రశ్న. దీనిపై వైద్యులు సానుకూల సమాచారం ఇచ్చారు. అవసరమైన శస్త్రచికిత్సలు పూర్తయిన తర్వాత కనీసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన అనంతరం తిరిగి తన డ్యాన్స్ కెరీర్ను కొనసాగించవచ్చని, ప్రస్తుతం అందుకు ఎలాంటి ప్రమాద సూచనలు కనిపించడం లేదని వైద్యులు వెల్లడించారు. ఈ సమాచారం అభిమానులకు కొంత ఊరటనిచ్చింది. మంగళవారం పండు మాస్టర్ తన బృందంతో కలిసి విశాఖ జిల్లా తగరపువలసలో నిర్వహించిన అమ్మవారి ఉత్సవాల్లో ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి ప్రయాణం చేస్తుండగా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో టీమ్లోని ఒక డ్యాన్సర్ అస్వస్థతకు గురికావడంతో వాహనాన్ని రోడ్డుపక్కన ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కారులో నుంచి దిగి వెనుక భాగంలో నిలబడి ఉన్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు మరియు వ్యాన్ మధ్య పండు మాస్టర్ చిక్కుకుపోయారు. దీంతో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, సహచరుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తుంది.