తన గొంతుకతో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయిన ఆయన పాట రూపంలో నిత్యం స్మరించుకుంటూనే ఉన్నాం. పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమం ద్వారా వారి ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చారు. కొన్నేళ్ల పాటు సక్సెస్ ఫుల్గా నడిచిన ఈ షో బాలు మరణం తర్వాత ఆగిపోయింది. ఇక ఈ కార్యక్రమానికి పులిస్టాప్ పడ్డట్టేనా అని అందరు భావిస్తున్న తరుణంలో పాడుతా తీయగా ప్రోగ్రామ్ని మళ్లీ షురూ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పాడుతా తీయగా అంటే మనకు గుర్తొచ్చేది బాలు మాత్రమే. జడ్జిగా ఆయన షోని నడిపిన తీరు అమోఘం. బాలు లేకుండా పాడుతా తీయగాని ఊహించలేము, ఆయన స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. అయితే ఈ కార్యక్రమం నిర్వాహకులు కొత్త జడ్జిలతో పాడుతా తీయగా కార్యక్రమాన్ని షురూ చేస్తున్నారట. ఎస్పీబీ తనయుడు చరణ్ సహా రైటర్ చంద్రబోస్, సింగర్ సునీత ఈ కార్యక్రమం జడ్జిలుగా వ్యవహరిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూట్ కూడా జరిగినట్టు సమాచారం.