సినిమా పరిశ్రమకు ఓటీటీ ద్వారా పోటీ ఏర్పడుతున్నది. అయితే సినిమాను థియేటర్లో చూసిన ఆనందం వేరు అన్నారు ప్రముఖ హీరో బాలకృష్ణ. హైదరాబాద్ కాచిగూడలో ఏషియన్ తారకరామ థియేటర్స్ను నిర్మాత, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…‘మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరింది. అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నది. ఇలాంటి సందర్భంలో సినిమాను మరింతగా ప్రేక్షకులకు చేరువ చేయాలి. అందుకు ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా పనిచేయాలి.
ఓటీటీ వల్ల సినిమా పరిశ్రమకు పోటీ ఏర్పడింది. అయితే సినిమాను థియేటర్లో చూస్తే పొందే ఆనందం వేరు. అందుబాటు టికెట్ ధరలు పెట్టడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. వారికి అనువైన వాతావరణం కల్పించాలి’ అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో మాకు మంచి అనుబంధం ఉందని, అది మరింతగా కొనసాగుతుందని అన్నారు నిర్మాత, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్.