వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తిప్రతాప్ సింగ్ దర్శకుడు. మానుషి చిల్లార్ కథానాయిక. సందీప్ ముద్దా నిర్మాత. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నారు. సోమవారం ‘ది ఫస్ట్ స్ట్రైక్’ టీజర్ను విడుదల చేశారు. దేశభక్తిని ప్రేరేపించే శక్తివంతమైన సంభాషణలతో టీజర్ ఆకట్టుకుంది.
వందేమాతరం నేపథ్య సంగీతం ప్రధానాకర్షణగా నిలిచింది. ‘భారతదేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద వైమానిక దాడి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వైమానిక దళ హీరోల ధైర్యసాహసాలను ఆవిష్కరిస్తుంది. దేశ రక్షణలో వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారన్నది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. యధార్ధ ఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: హరి కే వేదాంతం, సంగీతం: మిక్కీ జే మేయర్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, దర్శకత్వం: శక్తి ప్రతాప్సింగ్ హడా.