తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురుకి ముగ్గురు ఎవరికి వాళ్ళు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పైగా ఈ ముగ్గురు హీరోలకు ఎక్కడా చిన్న కనెక్షన్ కూడా ఉండదు. అందులోనూ నాని, అడివి శేష్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ముగ్గురు హీరోలను తాజాగా ఒక కామన్ పాయింట్ కనెక్ట్ చేస్తుంది. గత పది సంవత్సరాలలో ఈ ముగ్గురు హీరోలకు మాత్రమే డబుల్ హ్యాట్రిక్ అందుకునే అవకాశం వచ్చింది. ఈ రోజుల్లో ఒక్క హీట్ కొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు హీరోలు.. అలాంటిది ఏకంగా వరుసగా ఆరు విజయాలు అందుకోవడమనేది చిన్న విషయం కాదు. దాన్ని ఈ ముగ్గురు హీరోలు చేసి చూపించారు.
తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా మూడు రోజుల్లోనే 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నాలుగో రోజు నుంచి ఈ సినిమాకు వచ్చేవన్నీ లాభాలే. దాంతో మరో హిట్ ఈయన ఖాతాలో పడిపోయింది. దీనికి ముందు మేజర్, ఎవరు, గూడచారి, క్షణం సినిమాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్నాడు అడవి శేష్. మధ్యలో చేసిన అమితుమీ అనే కామెడీ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం శేష్ ఉన్న ఫామ్ తో పోలిస్తే ఆ సినిమాను అసలు లెక్కలోకి కూడా తీసుకోకూడదు. కెరియర్ కొత్తలో చేసిన సినిమా అది. ఒక్కసారి ఆయన సీరియస్ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత.. కెరీర్ పెరుగుతూ పోతూ ఉంది. క్షణం సినిమాకు రెండు కోట్లతో మొదలైన ఈయన ప్రయాణం.. ఈరోజు పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. అడవి శేష్ సినిమా అంటే కచ్చితంగా హిట్ అనే నమ్మకం ప్రేక్షకులలో కలిగించాడు ఈ హీరో.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా టెంపర్ నుంచి వరుస విజయాలు అందుకుంటున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ తో ఫామ్ లోకి వచ్చిన తారక్ ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ట్రిపుల్ ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ సాధించాడు. నాని కూడా తక్కువ ఏం తినలేదు. 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యంతో జైత్రయాత్ర మొదలుపెట్టి భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మెన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ సినిమాల వరకు వరుస విజయాలు అందుకున్నాడు. ఏకంగా 8 హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కి ఒక్క అడుగు ముందు బోల్తా కొట్టాడు నాని. కృష్ణార్జున విజయం సినిమాతో ఈయన వరుస విజయాలకు బ్రేక్ పడింది. గత పదేళ్ళలో తెలుగు ఇండస్ట్రీలో డబుల్ హ్యాట్రిక్ అందుకున్న హీరోలు ఈ ముగ్గురు మాత్రమే.