Om Bheem Bush OTT | రాజరాజచోర, సామజవరగమన, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడు టాలీవుడ్ యువహీరో శ్రీవిష్ణు. ఈ యువ నటుడు మళ్లీ అదే జానర్లో నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్(No Logic Only Magic) అనేది ఈ సినిమా ఉపశీర్షిక. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. రీతూవర్మ హీరోయిన్గా నటించగా.. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి ‘హుషార్’ (Husharu) ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఫన్ ఎంటర్టైనర్గా విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో ఉండగానే ఓటీటీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, మరియు రచ్చ రవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
three scientists. one wild treasure hunt. guaranteed chaos! 👻#OmBheemBushOnPrime, Apr 12 pic.twitter.com/LK0fRgb4qA
— prime video IN (@PrimeVideoIN) April 8, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మ్యాడీ రేలంగి(రాహుల్ రామకృష్ణ) లెగసీ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులు. వీరి అల్లరి భరించలేక, బలవంతంగా వీరిని పాస్ చేయించి మరీ యూనివర్సిటీ నుంచి బయటకి గెంటుతాడు ఆ కళాశాల ప్రొఫెసర్ (శ్రీకాంత్ అయ్యంగార్). షెల్డర్ పోవడంతో ముగ్గురూ భైరవపురం చేరుకుంటారు. ఆ ఊరులో ఎ టు జెడ్ సర్వీసెస్ అనే దుకాణం తెరుస్తారు. తమకు తెలిసిన విద్యలను ఉపయోగించి, అందరినీ తెలివిగా మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. అయితే, వీళ్లు ముగ్గురూ చేస్తున్న మోసం ఆ ఊరు జనానికి తెలిసిపోతుంది. దాంతో ఆ ఊరి పెద్ద ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఆ ఊళ్లో ఉన్న సంపంగిమహల్లో బంగారు నిధి ఉంటుంది. ఆ నిధిని తీసుకొస్తే మీరు మోసగాళ్లు కాదని నమ్ముతాం అంటారు. అసలు విషయం ఏంటంటే.. ఆ మహల్లో దెయ్యం ఉంటుంది. దానిపేరు సంపంగి. ఈ విషయం తెలిసి కూడా ఆ మహల్లోకి అడుగుపెడతారు హీరోలు ముగ్గురూ. మరి వారి మహల్లోకెళ్లిన ముగ్గురుకీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ మహల్లోని సంపగి దెయ్యం కథేంటి? ఈ ప్రశ్నలకు సమధానమే మిగతా కథ..