బిగ్ బాస్ షోతో బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమంతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ కార్యక్రమంకి సంబంధించి ఎప్పుడో అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది. షోకి సంబంధించి ఇప్పటికే పలు ప్రోమోలు విడుదల చేసిన నిర్వాహకులు తాజాగా మరో ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో కరోనా వలన లెక్చరర్ వృత్తిని కోల్పోయి దోసెల బండి పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. అతని దగ్గరకు టిఫిన్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఈ క్రమంలో ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హాజరైన లెక్చరర్ పాతిక లక్షలు గెలుచుకుంటాడు. అందులో సగాన్ని ఫీజులు కట్టలేని వారికి ఇస్తాను. మిగతా సగం ఇంట్లో ఖర్చులకి వాడుకుంటాను అని అన్నారు.
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ద్వారా మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు అని ఎన్టీఆర్ తాజాగా విడుదలైన ప్రోమోలో చెప్పుకొచ్చారు. ఇక్కడ కథ మీది కల మీది, ఆట నాది, కోటి మీది రండి గెలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఆగస్ట్ నుండి ఈ షో ప్రారంభం కానుందని తెలియజేయగా, తొలి గెస్ట్ రామ్ చరన్ అనే టాక్ నడుస్తుంది.