“రౌడీబాయ్స్’ మంచి సినిమాగా అందరికి గుర్తుండిపోవాలి. వైవిధ్యమైన చిత్రాల్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తారనే నమ్మకముంది’ అని అన్నారు అగ్ర హీరో ఎన్టీఆర్. ‘రౌడీబాయ్స్’ ట్రైలర్ను శనివారం ఆయన విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ఆది’ సమయంలో దిల్రాజు, శిరీష్తో అనుబంధం ఏర్పడింది. వారిని సోదరులుగా భావిస్తా. శిరీష్ తనయుడు ఆశిష్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతుండటం ఆనందంగా ఉంది. అతడి సినిమా ట్రైలర్ను నేను విడుదల చేయడం సంతోషాన్ని కలిగించింది. దిల్రాజు, శిరీష్లతో నా ప్రయాణాన్ని గుర్తుచేసుకునే అవకాశం దొరికింది. భవిష్యత్తులో ఆశిష్ మరిన్ని మంచి చిత్రాల్లో భాగం కావాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బాగుంది. ‘ప్రేమదేశం’ చూసిన అనుభూతిని కలిగిస్తుంది. తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని నమ్ముతున్నా’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘యువతరంతో పాటు కుటుంబ వర్గాలను మెప్పించే అన్ని హంగులున్న చిత్రమిది. కాలేజీ బ్యాక్డ్రాప్లో చక్కటి ఎంటర్టైనర్గా సాగుతుంది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని తెలిపారు.