యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ముంబైలో జరిగిన ప్రెస్మీట్లో మాట్లాడి అందరి మనసులు గెలుచుకున్న ఎన్టీఆర్ బెంగళూరు, చెన్నైలో జరిగిన ప్రెస్మీట్లోను తన మాటలతో అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. బెంగళూరులో జరిగిన ప్రెస్మీట్లో ఎన్టీఆర్తో పాటు రాజమౌళి, అలియా భట్, రామ్చరణ్ పాల్గొనగా, ఎన్టీఆర్.. తన ఫ్రెండ్ పునీత్ రాజ్కుమార్ని తలచుకొని ఎమోషనల్ అయ్యారు.
ఎక్కడ ఉన్నా ఆయన ఆశీర్వాదాలు మాత్రం తనకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నాడు ఎన్టీఆర్. అప్పు నటించిన సినిమాలోని గెలయా గెలయా.. సాంగ్ను పాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన గౌరవార్థం ఈ పాట ఇదే చివరిసారిగా పాడుతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. పునీత్ లేని లోటును ఎవరు కూడా భర్తీ చేయలేరని అన్నారు. వేరే బాష నటులు కూడా పునీత్ని మిస్ అవుతున్నారని తెలిపాడు.
పునీత్ మరణం తర్వాత నివాళి అర్పించడం కోసం తెలుగు సినీ ప్రముఖులంతా తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. పునీత్ తండ్రి రాజ్ కుమార్ హయాం నుంచి వారి కుటుంబానికి తెలుగు చిత్ర పరిశ్రమతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది . పునీత్ మరణం గురించి తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బెంగళూరుకి వెళ్లి స్నేహితుడికి ఘన నివాళులు అర్పించారు. చేతిలో చేయి వేసి నేనున్నాను అన్నా మీకు అని ఎన్టీఆర్ ధైర్యం చెప్పారని పునీత్ అన్న శివరాజ్ కుమార్ ఇటీవల ఇంటర్వ్యూలో అన్నారు. కాగా, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ జనవరి 7న విడుదల కానున్న విషయం తెలిసిందే.