కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. మరి కొద్ది నిమిషాలలోనే ఆయన మరణించినట్టు స్పష్టం చేశారు. పునీత్ మృతి కన్నడిగులకు తీరని శోకాన్ని మిగిల్చింది. పునీత్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచగా, ఆయనను చివరి చూపు చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులు కూడా వస్తున్నారు.
ఇప్పటికే శనివారం ఉదయం కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్కు నివాళులర్పించారు బాలయ్య . పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్కుమార్ని పరామర్శించారు. బాలకృష్ణతోపాటు నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా సైతం నివాళులర్పించారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కంఠీరవ స్టేడియానికి వెళ్లి తన స్నేహితుడికి నివాళులు అర్పించారు. స్నేహితుడిని అలా చూసి కన్నీరు కూడా పెట్టుకున్నారు ఎన్టీఆర్. కాగా, రాజ్ కుమార్ టైం నుండి ఆ కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది.