ఆస్కార్ పురస్కారాల వేడుక కోసం అమెరికా వెళ్లిన అగ్ర నటుడు ఎన్టీఆర్ హైదరాబాద్కు తిరిగొచ్చారు. దాంతో ఆయన తాజా చిత్రం ప్రారంభోత్సవం ఎప్పుడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా ఇది కావడంతో అభిమానుల్లో ఆసక్తినెలకొంది. గత నెలలోనే లాంఛనంగా ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఆస్కార్ సందడి కూడా ముగియడంతో ఇక ఎన్టీఆర్ ఈ సినిమాపై దృష్టి పెట్టబోతున్నారని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 23న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని, ఏప్రిల్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ నాయిక జాన్వీకపూర్ ఈ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేయబోతున్నది.