NTR30 | ఎన్నో నెలల నుంచి ఎన్టీఆర్ అభిమానులు వెయిట్ చేస్తున్న కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఎట్టకేలకు జరిగింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. మార్చి చివరివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకోకూడదని ఆలోచిస్తున్నాడు కొరటాల. వీలైనంతవరకు ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి.. డిసెంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 5, 2024న ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా.. అలాగే సౌత్ సినిమా కూడా. చాలా సంవత్సరాల నుంచి సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న జాన్వీకి.. ఇంతకంటే అద్భుతమైన ఎంట్రీ ఇంకొకటి ఉండదు అంటున్నారు అభిమానులు. పైగా ఈ సినిమా కోసం ఆమె 5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్కడి ప్రజలు దేవుడికి, చావుకు భయపడరు. మరి దేనికి భయపడతారు? అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇందులో మరో కీలకమైన విషయం కూడా ఉంది. కేవలం ఇండియన్ ఆడియన్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కాదు.. ఆస్కార్ తో జూనియర్ ఎన్టీఆర్కు హాలీవుడ్లో వచ్చిన గుర్తింపును వాడుకునేలా కొరటాల స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఈ సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
ఆ మధ్య ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లినప్పుడు తన నెక్స్ట్ సినిమా కూడా ఆర్ఆర్ఆర్ స్థాయిలో ఉంటుందని చెప్పాడు తారక్. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తి రెండింతలు అయింది. మరోవైపు కొన్ని సంవత్సరాలుగా ఫ్లాపుల్లో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తూ వరుసగా హిట్లు కొడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ కూడా ఇదే చేస్తే తారక్ కు మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్టే. కళ్యాణ్ రామ్ తో కలిసి కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.