మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో బాలీవుడ్ తార నోరా ఫతేహీని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక నేరాల విభాగం అధికారులు గురువారం ఆమెను ఆరుగంటల పాటు విచారించారు. ఈ విచారణలో తను కేవలం బాధితురాలినేనని, దోషిని కానని నోరా చెప్పుకుంది. ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ అఫ్సర్ జైదీ ఆహ్వానం మేరకు చెన్నైలో జరిగిన ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆమె అధికారులకు చెప్పింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతిఫలంగా ఆమె బీఎండబ్ల్యూ కారు ఇవ్వాలని డిమాండ్ చేసిందనే విషయాన్ని అధికారులు ప్రశ్నించగా…ఆ కారును ప్రేమతో బహుమతిగా ఇచ్చారని చెప్పింది నోరా ఫతేహి. ఆమె స్పందిస్తూ…‘ఈ కేసులో నేను దోషిని కాదు, బాధితురాలిని. నాపై కుట్ర చేశారు. నా అభిమానులం అని చెప్పుకుని ఖరీదైన బహుమతులు ఇచ్చారు’ అని చెప్పింది.