కల్యాణ్రామ్ మంచి నటుడు మాత్రమే కాదు, అభిరుచి గల నిర్మాత. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో దిట్ట. అందుకే ఆయన స్వీయ నిర్మాణంలో సినిమా అంటే ఆటోమేటిగ్గా అంచనాలుంటాయి. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో.. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసులతో కలిసి కల్యాణ్రామ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్ కథానాయిక. నాటి లేడీ సూపర్స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఏప్రిల్లో రిలీజ్ చేసే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. గతంలో ‘మెరుపు’ అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత ‘రుద్ర’ అనే టైటిల్ బయటకు వచ్చింది. అయితే.. ఈ రెండూ కాకుండా ఏదైనా శక్తిమంతమైన పేరును పెట్టాలని చిత్రబృందం యోచిస్తున్నదట. ప్రస్తుతం టైటిల్ అన్వేషణ జరుగుతున్నది. ఖరారవ్వగానే గ్లింప్స్తో పాటు టీజర్ని కూడా విడుదల చేస్తారట. ఇటీవలే రషస్ చూసిన కల్యాణ్రామ్ చిత్ర విజయంపై నమ్మకంతో ఉన్నారని, ఆయన కెరీర్లో అతనొక్కడే, పటాస్, బింబిసార తరహాలోనే ఇది కూడా బ్లాక్బస్టర్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీకాంత్, అర్జున్ రాంపాల్, సౌహైల్ఖాన్ ఇందులో కీలక పాత్రధారులు.