Ramayana | ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రభాస్ టైటిల్ పాత్రలో ఓం రౌత్ రూపొందించిన ఈ సినిమా విడుదల రోజు నుంచే వివాదాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాను తీయబోయే ‘రామాయణం’ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు అగ్ర దర్శకుడు నితీష్ తివారి. ప్రముఖ నిర్మాత మధు మంతెన పాన్ ఇండియా స్థాయిలో రామాయణాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహించబోతున్నారు. రాముడి పాత్రలో రణబీర్కపూర్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి.
నితీష్ తివారి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బవాల్’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆదిపురుష్’ సినిమాపై వచ్చిన విమర్శలపై స్పందించారు నితీష్ తివారి. ‘నేను తీయబోయే రామాయణాన్ని ఓ ప్రేక్షకుడి దృష్టి కోణం నుంచి చూస్తాను. ఎవరి మనోభావాలు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నా. ఎలాంటి వివాదాలకు తావులేకుండా భక్తి భావాలను ప్రోది చేసేలా రామాయణ దృశ్య కావ్యాన్ని రూపొందిస్తాననే విశ్వాసం ఉంది’ అని చెప్పారు. ‘దంగల్’ చిత్రంతో దర్శకుడు నితీష్ తివారి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘దంగల్’ ఇప్పటికీ రికార్డును కొనసాగిస్తున్నది.