నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ’మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి నాయిక. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలోశ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్ లో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు దర్శకులు సురేందర్ రెడ్డి, హను రాఘవపూడి, మెహర్ రమేష్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ…’నాతో సినిమా చేస్తానని ఒక స్నేహితుడిగా మాటిచ్చిన నితిన్ దాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సినిమాతో మా అందరికీ సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా. గత వారం రెండు సినిమాలు హిట్ అయ్యాయి. వచ్చే వారం మా సినిమా ఆ విజయాలను కొనసాగిస్తుంది’ అన్నారు.
హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ…’క్లాస్ మాస్ అంశాలు కలిసిన చిత్రమిది. ఈ సినిమాలో నేను స్వాతి అనే క్యారెక్టర్ లో నటించాను. సంప్రదాయంగా కనిపించే పాత్ర నాది. మా దర్శకుడికి సినిమా మీద పూర్తి స్పష్టత ఉంది. రెండు వరుస విజయాలతో టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చాయి. మా సినిమా కూడా అలాగే విజయం సాధిస్తుంది’ అని చెప్పింది. హీరో నితిన్ మాట్లాడుతూ…’మీ అందరి అభిమానం వల్లే నేను 20 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నాను. ఇదే ఆదరణతో భవిష్యత్ లోనూ మంచి చిత్రాల్లో నటిస్తానని ఆశిస్తున్నాను. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఇంత మాస్, యాక్షన్ ఫిల్మ్ ఇప్పటిదాకా నా కెరీర్ లో చేయలేదు. నా స్నేహితుడు రాజశేఖర్ మంచి కమర్షియల్ మూవీ రూపొందించాడు. అతను పెద్ద దర్శకుడు అవుతాడని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను చూస్తారు. ఈ నెల 12న పెద్ద హిట్ సాధించబోతున్నాం’ అని అన్నారు.