Actor Nithiin | టాలీవుడ్ హీరో నితిన్ భార్య శాలిని రెడ్డి కరోనా పాజిటివ్గా పరీక్షించబడ్డారు. దీంతో శాలిని బర్త్ డే వేడుకలను నితిన్ వినూత్నంగా నిర్వహించి, నెటిజన్ల మనసును దోచుకున్నాడు. శాలిని కరోనా బారిన పడటంతో ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు.
శాలిని బర్త్డే వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కొవిడ్కు సరిహద్దులు ఉన్నాయేమో.. మన ప్రేమకు సరిహద్దులు లేవు.. హ్యాపీ బర్త్ డే టు మై లవ్. లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్లో నితిన్ రాసుకొచ్చాడు.
ఇక వీడియో విషయానికి వస్తే.. శాలిని మొదటి అంతస్తులోని తన గదిలో ఉండగా.. నితిన్ గార్డెన్ ఏరియాలో ఉండి కేక్ కట్ చేశారు. ఆ కేక్ ముక్కను శాలిని తినిపిస్తున్నట్లు ఊహాల్లో తేలియాడారు. అనంతరం తానే ఆ కేక్ను తినేసి చాలా బాగుంది అంటూ తన ప్రేమను చాటుకున్నారు నితిన్. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నితిన్, శాలిని వివాహం 2020లో అయింది.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్, హీరో మహేష్ బాబు, విశ్వక్ సేన్, లక్ష్మీ మంచు తదితరులు కోవిడ్ బారిన పడ్డారు. అందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు.