నూతన తారాగణంతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. నిహారిక కొణిదెల సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్తేజ్ క్లాప్నివ్వగా, నాగబాబు కెమెరా స్విఛాన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘మా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ఫిల్మ్స్ మాత్రమే చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్స్ తీయబోతున్నాం. వినూత్నమైన కాన్సెప్ట్తో రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చెప్పింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ని పరిచయం చేస్తున్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్దేవ్, ప్రొడక్షన్ డిజైనర్: ప్రణయ్ నైని, రచన-దర్శకత్వం: యదువంశీ.