‘స్వాతిముత్యం’ చిత్రంతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ గణేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ద్వారా రాకేష్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ ‘ఇదొక థ్రిల్లర్ కథ. మనకి ఇష్టమైన ఫోన్, అవసరమైన ఐడెంటిటీ, భయపెట్టే గన్ ఈ మూడింటి చుట్టూ తిరిగే కథ ఇది. హీరోకి, కమిషనర్కి వార్ ఎలా వచ్చిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.ప్రతి ముప్పై నిమిషాలకు ఊహించని మలుపు వస్తుంది.
సినిమా రెండు గంటల ఏడు నిమిషాలు ఉంటుంది. కృష్ణచైతన్య అందించిన కథను నేను బాగా తీయగలనని సతీష్, సురేష్ భావించడంతో దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాను. నేను దర్శకుడు తేజ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆయన ఊటబావి లాంటి వ్యక్తి. ప్రతి రోజు కొత్తగా ఆలోచిస్తారు. ఆయన దగ్గర పూర్తిగా నేర్చుకోకపోయినా చాలా విషయాల్లో అవగాహన పెరిగింది. థ్రిల్లర్ సినిమాలకు సాధారణంగా ఉండే ఫార్ములాను బ్రేక్ చేస్త్తూ కమర్షియల్ కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించాను. తప్పకుండా ఈ చిత్రం నాకు దర్శకునిగా మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు.