అగ్ర నటి నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’కి విడుదలైన నాటినుంచి అడుగడుగునా అవాంతరాలే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని నయనతార సన్నివేశాలను ఈ డాక్యుమెంటరీలో భాగం చేయడంతో కొన్ని నెలల క్రితం నిర్మాత ధనుష్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ వేడి ఇప్పుడిప్పుడే చల్లారుతున్న తరుణంలో మళ్లీ అగ్గి రాజేస్తూ.. ‘చంద్రముఖి’ సినిమా కాపీరైట్స్ పొందిన ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ డాక్యుమెంటరీపై మద్రాసు కోర్టును ఆశ్రయించింది. డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఉపయోగించారని, అందుకు పరిహారంగా 5కోట్ల రూపాయలు చెల్లించాలని ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని సోమవారం విచారించిన కోర్టు.. డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్ స్టూడియోకీ, అలాగే నెట్ఫ్లిక్స్కీ రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.