ఎటువంటి పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతారు విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ‘సైంధవ్’ చిత్ర ద్వారా ఈ వెర్సటైల్ యాక్టర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. వెంకటేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఈ నెల 13న ‘సైంధవ్’ విడుదలకానుంది. ఈ సందర్భంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
తెలుగులో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ‘సైంధవ్’తో కుదిరింది. ప్రతి నటుడు గొప్ప కథ కోసం ఎదురుచూస్తాడు. ఇదీ అలాంటి కథనే. ఫ్యామిలీ ఎమోషన్స్తో ప్రతీ ఒక్కరిని కట్టిపడేస్తుంది. ఇక ఓ నటుడిగా నేను విలన్, హీరో పాత్రలు అంటూ వేరుగా చూడను. నా పాత్రలో ఆసక్తికరమైన అంశాలుంటే చాలు..వెంటనే అంగీకరిస్తా. కొన్నిసార్లు నెగెటివ్ రోల్స్లోనే బెస్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశం దక్కుతుంది. గతంలో బాలీవుడ్లో నేను విలన్ రోల్స్ చేశాను. ‘సైంధవ్’లో నా క్యారెక్టర్ను మరింత కొత్తగా డిజైన్ చేశారు. తెలుగులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. సొంతంగా డబ్బింగ్ చెప్పినప్పుడే పాత్రకు న్యాయం జరుగుతుందని భావిస్తాను. తెలుగు భాషను, భావాలను అర్థం చేసుకొని డబ్బింగ్ చెప్పాను.
వెంకటేష్ వంటి సీనియర్ నటుడితో తెరను పంచుకోవడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయనకు ఓర్పు చాలా ఎక్కువ. ఎప్పుడూ ప్రశాంతగా కనిపిస్తారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. పోరాట ఘట్టాలు మరో స్థాయిలో ఉంటాయి. ఈ సినిమా కోసం దాదాపు 40 రోజులు పనిచేశాను. తెలుగు ప్రేక్షకులు నా నటనను ఇష్టపడతారనే నమ్మకం ఉంది. ఆధ్యాత్మిక గురువు ఓషో పాత్రలో నటించాలన్నది నా డ్రీమ్. అవకాశం వస్తే ఆయన బయోపిక్లో నటిస్తా.