“అలా మొదలైంది’ సినిమాతో నిత్యామీనన్ నాకు మంచి స్నేహితురాలిగా మారింది. కథానాయికగా మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు అభిమానించే స్థాయికి ఎదిగింది. ఈ సినిమా ద్వారా ఆమె నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు నాని. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘స్కైలాబ్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. విశ్వక్ ఖండేరావు దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. డిసెంబర్ 4న విడుదలకానుంది. నాని మాట్లాడుతూ ‘పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చినంత ఆనందంతో టీమ్ అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. స్కైలాబ్ ఇతివృత్తంతో సినిమా చేయాలనే ఆలోచన బాగుంది. ఈ కథను నాకు చెప్పాలనుకున్నానని దర్శకుడు విశ్వక్ అన్నాడు. అతడి మాట వినగానే మంచి సినిమా మిస్ అయ్యాననిపించింది’ అన్నారు. నిర్మాతగానే కాకుండా నటిగా తనకు చక్కటి సంతృప్తిని మిగిల్చిన చిత్రమిదని నిత్యామీనన్ చెప్పింది. సత్యదేవ్ మాట్లాడుతూ ‘బండలింగపల్లి అనే గ్రామాన్ని, అందులోని పాత్రలను దర్శకుడు అద్భుతంగా సృష్టించారు. గొప్ప తెలుగు సినిమా ఇదని అందరూ గర్వంగా చెప్పుకొనేలా ఉంటుంది’ తెలిపారు ‘దర్శకుడినవ్వాలనే నా పన్నెండేళ్ల కల ఈ సినిమాతో తీరింది. సందర్భానుసారంగా వచ్చే వినోదం ఆకట్టుకుంటుంది’ అని విశ్వక్ ఖండేరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్, వివేక్ ఆత్రేయ, పృథ్వీ పిన్నమరాజు తదితరులు పాల్గొన్నారు.