సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌషిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మైఖేల్’. 80వ దశకంలో సాగే కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ జయకొడి రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ పతాకాలపై భరత్ చౌదరి, పూస్కుర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను తాజాగా హీరో నాని విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఉన్న ఈ టీజర్లో ‘వేటాడటం రాని జంతువులే వేటకు చిక్కుతాయి..’, ’మన్నించేవాడే దేవుడు..’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీజర్ విడుదల సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..‘మూడేళ్ల క్రితం ఈ సినిమా పనులు మొదలు పెట్టాం. రంజిత్ జయకోడి లాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ప్రతి సినిమాను ఇదే చివరి చిత్రంగా భావించి కష్టపడమని ఆయన చెబుతారు. ఈ చిత్రం కోసం 24 కిలోల బరువు తగ్గాను. విజయ్ సేతుపతితో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఈ చిత్రంతో ఓ కొత్త ప్రయత్నం చేశాం.
మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు మొదటి స్థానంలో ఉంటారు. వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది’ అన్నారు. నిర్మాత పూస్కుర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ…‘ఈ సినిమాలో బలమైన కంటెంట్ ఉంది. ఐదు భాషల్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రం కోసం సందీప్కిషన్ బాగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం ఉంటుంది. ప్రొడక్షన్ పరంగా ఇది భారీ సినిమా. టీజర్కు స్పందన బాగుంది’ అన్నారు. ‘80వ దశకం నేపథ్యంగా సాగే చిత్రమిది. థియేటర్లోనే ఈ చిత్రాన్ని ఆస్వాదించాలి. టీజర్లో చూసింది కొంతే. కథను నమ్మి టీమ్ అంతా కష్టపడ్డాం’ అని నాయిక దివ్యాంశ కౌషిక్ చెప్పింది.