హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): పండ్లను మగ్గబెట్టేందుకు ‘ఎన్రైప్’ అనే సరికొత్త పౌడర్ను తెలంగాణ ఆగ్రోస్ అందుబాటులోకి తెచ్చింది. నిషేధిత కార్బైడ్, చైనాకు చెందిన ఇథెఫాన్తో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న నేపథ్యంలో సహజసిద్ధంగా తయారుచేసిన ఈ పౌడర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. మూడేండ్లపాటు అనేక ప్రయోగాలు చేశాకే, దుష్ప్రభావాలు, ఇతర అనారోగ్యాలు రావని తేలాకే దీన్ని అనుమతించారు. ఎన్రైప్ పౌడర్ ఉపయోగించడం వల్ల ఏ రకం పండ్లు అయినాసరే సహజసిద్ధంగా పండుతాయని ప్రయోగాల్లో తేలింది. ఈ పౌడర్కు ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఐఐహెచ్ఆర్, ఐఐసీటీ అనుమతులు కూడా తీసుకోవడం గమనార్హం. మామిడి పండ్లనే కాకుండా నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, టమాట వంటి అన్నిరకాల సిట్రస్ జాతి పండ్లను కూడా మగ్గపెట్టొచ్చు. మూడ్రోజుల్లోనే పండ్లు పక్వానికి వస్తాయి. ఎన్రైప్ ఐదు గ్రాముల ప్యాకెట్ ధర రూ.4.86 గా నిర్ణయించారు. ఒక ప్యాకెట్ 10 కిలోలకు సరిపోతుంది.
చైనా పౌడర్తో క్యాన్సర్
కరోనా నేపథ్యంలో ప్రజలు విటమిన్-సీ పండ్లను ఎక్కువగా తింటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొన్న వ్యాపారులు తొందరగా మగ్గించేందుకు చైనా పౌడర్ను వాడుతున్నారు. ఆ పౌడర్తో 24 గంటల్లోనే పండ్లు మగ్గుతాయి. అయితే, వీటివల్ల క్యాన్సర్తో పాటు శ్వాసకోశ, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే..
ప్రస్తుతం పండ్లను మగ్గబెట్టేందుకు ప్రమాదకరమైన చైనా పౌడర్లను, కార్బైడ్ను ఉపయోగిస్తున్నారు. వీటివల్ల ప్రమాదకర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఎన్రైప్ పౌడర్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ పౌడర్పై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. దీని వాడకంపై వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నాం. – రాములు, ఎండీ, ఆగ్రోస్