Nandamuri Tarakaratna | కుప్పం నియోజక వర్గ కేంద్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్నను వెంటనే కుప్పం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.
అర్థరాత్రి వరకు బాలకృష్ణ కుప్పం ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే డాక్టర్లు చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించారు. డాక్లర్ల బృందం అర్థరాత్రి గంటన్నర సమయంలోనే తారకరత్నను హుటాహుటిన బెంగళూరుకు తరలించింది. తెల్లవారు జామున రెండు గంటల నుంచి తారకరత్నకు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. డాక్టర్ ఉదయ్ నేతృత్వంలోని వైద్యుల బృందం తారకరత్నకు చికిత్సనందిస్తోంది.
నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితి కొంత విషమంగానే ఉందని, గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్లే ఆయనకు స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్లు ఆయనకు ఎలాంటి స్టంట్లు వేయలేదు. తారకరత్నకు యాంజియో గ్రామ్ పూర్తయింది. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తామని ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు.
మరోవైపు తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తామని, ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ ఇప్పటికే అభిమానులకు సూచించారు.