“బిగ్బాస్ షో’ వ్యాఖ్యాతగా నాకు కొత్త అనుభూతిని మిగిల్చింది. ఈ షోలోకి ఎన్నో సంశయాలతో అడుగుపెట్టా. అందులోకి వెళ్లిన తర్వాత బిగ్బాస్కు అభిమానిగా మారిపోయా. త్వరలో కొత్త విధానంలో ఓటీటీ బిగ్బాస్ను ప్రారంభించబోతున్నాం’ అని అన్నారు అగ్రహీరో నాగార్జున. శుక్రవారం హైదరాబాద్లో ‘డిస్నీ హాట్స్టార్’ ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “బిగ్బాస్’ తర్వాత తమ లైఫ్ మారిపోయిందని చాలా మంది కంటెస్టెంట్స్ చెప్పడం ఆనందంగా ఉంది. ఈ షో ద్వారా తమ కలలు నెరవేరాయని అంటున్నారు. బిగ్బాస్ ఐదో సీజన్ ముగుస్తుందనగానే చాలా మంది నిరుత్సాహపడ్డారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపడానికి ఓటీటీ బిగ్బాస్ను త్వరలో మొదలుపెట్టబోతున్నాం. కొత్త విధానంలో 24 గంటల లైవ్గా ఈ షో ఉంటుంది. టీవీ బిగ్బాస్తో పోలిస్తే ఓటీటీ షోకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓటీటీలో బిగ్బాస్కు హోస్ట్గా పనిచేయడాన్ని చాలెంజింగ్గా భావిస్తున్నా’ అని తెలిపారు. ‘డిస్నీహాట్స్టార్ ద్వారా త్వరలో తెలుగులో ‘పరంపర’ సిరీస్ రాబోతున్నది. ఇందులో జగపతిబాబు, శరత్కుమార్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో తారకరత్న, అజయ్ కాంబినేషన్లో ‘9 అవర్స్’ , మహి.వి.రాఘవ్ ‘సైతాన్’ సినిమాలు రూపొందనున్నాయి’ అని డిస్నీహాట్స్టార్ ప్రెసిడెంట్ సునీల్ రాయన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంజలి,ఆకాంక్షసింగ్ పాల్గొన్నారు