మాకంటూ సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చలేదు.. అభిమానులు ఏం చెప్తే అదే చేయాలి.. అలాంటి ఇండస్ట్రీలో మేమున్నామంటూ స్టార్ హీరోలను ఉద్దేశించి నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది కేవలం సినిమాను ఉద్దేశించి మాత్రమే కాదు.. బయట కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే మేము ఇలాంటి సినిమా చేస్తే మా ఫ్యాన్స్ ఒప్పుకోరని భయపడుతుంటారు స్టార్ హీరోలు. వాళ్ళకంటూ ఉన్న ఓ ఇమేజ్ చట్రంలో ఇరుక్కొని.. కేవలం దానికి సరిపోయే కథలు మాత్రమే చేస్తూ ఉంటారు.
ఎప్పుడన్నా ఫ్యాన్స్ కోరిక కాదని అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు చేస్తే.. వాటి ఫలితం కూడా అంతే దారుణంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జున దీన్ని రుచి చూస్తూనే ఉన్నాడు. అయినా కూడా మనసు మార్చుకోవడం లేదు మన్మధుడు. సాధారణంగా నాగార్జున అంటే రొమాంటిక్ హీరో. ఆయనను అలాంటి కథలలో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈయన హీరోయిన్లతో రొమాంటిక్ డ్యూయెట్ పాడుతుంటే థియేటర్లలో విజిల్స్ వేసి ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. కానీ అదే నాగార్జున చేతిలో గన్ను పట్టుకొని విలన్స్ ను కాల్చుకుంటూ వెళ్తే.. కత్తి చేత పట్టుకొని నరుక్కుంటూ పోతే చూడడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటి యాక్షన్ సినిమాలు వ్యక్తిగతంగా నాగ్ కు బాగా ఇష్టం.. కానీ ఆయన అభిమానులకు మాత్రం కాదు.
గత పదేళ్లలో నాగార్జున చేసిన భాయ్, ఆఫీసర్, వైల్డ్ డాగ్, రగడ లాంటి మాస్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. అయినా కూడా ప్రవీణ్ సత్తారు చెప్పిన కథ నమ్మి తాజాగా ఘోస్ట్ సినిమాతో వచ్చాడు నాగార్జున. దసరాకు విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నాయి. మొదటి రోజు కేవలం 2.45 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కోటి లోపలికి పడిపోయింది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 20 కోట్లకు పైగా షేర్ రావాల్సిందే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే కనీసం 10 కోట్లు కూడా దాటేలా కనిపించడం లేదు.
వీటి పరిస్థితి చూసిన తర్వాత ఇకపై పొరపాటున కూడా మీరు యాక్షన్ సినిమాల జోలికి వెళ్ళకండి అంటూ నాగార్జునని కోరుతున్నారు ఫాన్స్.. మీకు బాగా కలిసొచ్చిన రొమాంటిక్ జోనర్ లోని సినిమాలు చేయండి అంటూ సోషల్ మీడియాలో ఆయనకు సలహాలు ఇస్తున్నారు. మరి అభిమానుల కోరికను ఆయన ఎంతవరకు మన్నిస్తారో చూడాలి. అన్నట్టు ఈయన 100వ సినిమా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో ప్లాన్ చేస్తున్నాడు. అందులో అఖిల్ కూడా మరో హీరోగా నటించబోతున్నాడు. ఈ అక్కినేని మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.