‘ఈ సినిమాలో పద్మనాభస్వామి గుడి నేపథ్యం ప్రధానాకర్షణగా ఉంటుంది. పతాకఘట్టాలు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. పౌరాణిక అంశాలకు కాల్పనికతను జోడించి ప్రేక్షకుల్ని దైవికమైన అనుభూతిని అందించే సినిమా ఇది’ అన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్.సౌందరరాజన్. విరాట్కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివైన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’ చిత్రానికి ఆయన కెమెరామెన్గా బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఎస్.సౌందరరాజన్ పాత్రికేయులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని సహజమైన లైటింగ్తో తీశామని, దాంతో కథలో ప్రేక్షకులు లీనమైపోతారని, విజువల్ ఎఫెక్ట్స్ కూడా నేచురల్గా ఉంటాయన్నారు.
‘ఈ సినిమా కోసం దర్శకుడు, ఆర్ట్ డైరెక్టర్తో కలిసి తిరువనంతపురంలోని శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించాం. అక్కడ ప్రతీ అంశాన్ని వివరంగా ఫొటోగ్రాఫ్ చేశాం. సినిమాలో ఈ ఆలయానికి ‘శ్రీరంగపురం’ అనే పేరు పెట్టాం. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అద్భుతమైన సెట్స్ వేశారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు నిజంగా పద్మనాభస్వామి ఆలయంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. పెద్ద సెట్స్లో ఈ సినిమా తీశాం. మొత్తం సెట్ను ఒకేషాట్లో చూపించడం సవాలుగా అనిపించేది. అందుకోసం ఖరీదైన డ్రోన్స్ను ఉపయోగించాం. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లార్జ్స్కేల్లో రూపొందించిన సినిమా ఇది. విజువల్ ఫీస్ట్లా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు.