యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘తండేల్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకుడు. మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి నాగచైతన్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘2018లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతర్లీనంగా ప్రేమకథ కూడా ఉంటుంది. వ్యవస్థలోని అక్రమాలను, రాజకీయాలను ప్రశ్నిస్తుంది. ఈ తరహా పాత్రలు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే లభిస్తాయి. ఈ సినిమా కోసం నన్ను నేను తీర్చిదిద్దుకున్నా. ఈ సినిమా గురించి నాన్నతో చాలా సార్లు చర్చించాను. ఆయన నాకెప్పుడూ మంచి సలహాలిస్తుంటారు. క్రియేటివ్గా ఆలోచించాలని చెబుతుంటారు. విమర్శలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో చెబుతాడు’ అని నాగచైతన్య అన్నారు. ‘తండేల్’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.