Actor Naga Chiatanya | ఈ మధ్య పెద్ద హీరోల నుంచి కుర్ర హీరోల వరకు చాలా మంది ఒకేసారి రెండు, మూడేసి సినిమాలు ఏకకాలంలో చేస్తున్నారు. ఏడాదికి ఎట్టి పరిస్థితుల్లో రెండు, మూడు సినిమాలైనా రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. దీనికి నాగచైతన్య కూడా నడుం బిగించినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ అక్కినేని వారసుడు రెండు సినిమాలను ఏకకాలంలో చేయాలని నిశ్చయించుకున్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం చైతన్య, చందూ ముండేటితో పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రేపో మాపో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో చైతన్య జాలరిగా కనిపించబోతున్నాడు. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.
ఇక చైతన్య తన తదుపరి సినిమాను శివ నిర్వాణతో చేయబోతున్నాడు. మజిలీ తర్వాత మళ్లీ ఓ ఎమోషనల్ ప్రేమ కథ నేపథ్యంలో వీళ్ల సినిమా తెరకెక్కనుందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఖుషీ విడుదల తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో శివ బిజీ కానున్నాడట. అన్నీ కుదిరితే ఈ సినిమాను అక్టోబర్, నవంబర్ నెలల్లో పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట నాగచైతన్య. ఇలా నాగ చైతన్య రెండు సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి మొదలుపెట్టి.. మార్చి మార్చి డేట్లు కేటాయిస్తూ సమాంతరంగా రెండు సినిమాల షూటింగ్ లను పూర్తి చేస్తాడట. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో రెండు సినిమాలను విడుదల చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడట. అయితే రెండు సినిమాలు రెండు విభిన్న జానర్లో తెరకెక్కుతున్నవే. లుక్ పరంగా రెండు సినిమాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుంది. మరీ అలాంటి రిస్క్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.
నాగచైతన్య హిట్టు చూసి రెండేళ్లయింది. లవ్స్టోరీ తర్వాత నాగచైతన్యకు సాలిడ్ హిట్టే లేదు. సోగ్గాడే క్రేజ్తో బంగార్రాజు జస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ను టచ్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన థాంక్యూ రెండో రోజే దుకాణం సర్దేసింది. మనం వంటి మర్చిపోలేని హిట్టిచ్చిన విక్రమ్ కే కుమార్ సైతం ఈ సారి నాగ చైతన్యను కాపాడలేకపోయాడు. గంపెడంత ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్దా బాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ దెబ్బతో చైతన్య బాలీవుడ్ వైపు చూడటమే మానేశాడు. ఇక వెంకట్ ప్రభు వంటి కమర్షియల్ దర్శకుడిని నమ్ముకున్నా.. కస్టడీ రూపంలో తేరుకోలేని దెబ్బ పడింది. ప్రస్తుతం నాగచైతన్య ఓ భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.