‘ట్రైలర్ చూస్తుంటే సెలబ్రేషన్లా అనిపిస్తున్నది. ప్రేక్షకులకు పండుగ వినోదాన్ని పరిపూర్ణంగా ఈ సినిమా అందిస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు నాగచైతన్య. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్, పూజాహెగ్డే నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ నిర్మించారు. ఈ నెల 15న విడుదలకానుంది. నాగచైతన్య మాట్లాడుతూ ‘సినిమా ఫలితం కంటే దాని కోసం సన్నద్ధమయ్యే విధానాన్ని అఖిల్ ఎంతగానో ప్రేమిస్తాడు’ అని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ ‘మంచి సినిమా తీశామని గర్వంగా చెబుతున్నాం. కొవిడ్ తర్వాత థియేటర్స్లో సినిమాలు ఆడుతాయా?లేదా? అని భయపడుతున్న తరుణంలో ‘లవ్స్టోరీ’ అందరికి ధైర్యాన్ని చ్చింది. ఆ విజయపరంపరను కొనసాగిస్తామనే నమ్మకముంది. థియేటర్స్కు మంచి రోజులు రాబోతున్నాయి. గత వైభవాన్ని తప్పకుండా చూస్తాం’ అని చెప్పారు. ‘అఖిల్ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే చిత్రమిదని దర్శకుడు తెలిపారు.