‘చిన్నప్పుడే సినిమాపై నాకు ఇష్టం పెరిగిందంటే కారణం ‘ఆదిత్య 369’ సినిమా. అలాంటి నేను సింగీతంగారితో సినిమా చేస్తానని అనుకోలేదు. ఇది నిజంగా మా అదృష్టం. దేవిశ్రీ ఈ సినిమాకు పిల్లర్, సహాయ దర్శకుడు సంకల్ప్ మరో పిల్లర్. అనుకున్న దానికంటే స్పందన బావుంది. ఫ్యామిలీస్తో సినిమాకు వెళ్తున్నారు’ అని నిర్మాత నాగ్అశ్విన్ ఆనందం వెలిబుచ్చారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘సింగ్ గీతం’. అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రధారులు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్మీట్లో నాగ్అశ్విన్ మాట్లాడారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమా చేయాలనేది ఎప్పట్నుంచో నాకోరిక. సింగీతంగారి వల్ల ఆ కోరిక తీరింది. పదేళ్ల క్రితం సింగీతం నాకీ కథ చెప్పారు. ఎప్పుడు సినిమాగా వస్తుందా అనుకున్నా. ఇన్నాళ్లకు వచ్చింది. నాగ్అశ్విన్ ఈ సినిమాను నిర్మించకపోతే ఈ సెలబ్రేషన్ లేదు. సింగీతంగారి సినిమాకు సంగీతం అందించడం ప్రౌడ్గా ఫీలవుతున్నా’ అని పేర్కొన్నారు. ‘సింగీతంగారు తీసినవన్నీ ల్యాండ్ మార్క్ ఫిలింసే. ఇప్పుడు ఈ సినిమా కూడా. ఈ సినిమాకు పనిచేసిన అందరూ అదృష్టవంతులు. సింగీతంగారితో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టం. ఒక మ్యాడ్నెస్ ఉంటేనే సినిమాను ఇంతబాగా తీయగలరు’ అని అతిథిగా విచ్చేసిన అనిల్ రావిపూడి అన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.