హైదరాబాద్: సింగర్ కాలభైరవ (Singer Kaala Bhairava) రాహుల్ సిప్లిగంజ్తో కలిసి RRR సినిమాలో నాటునాటు పాట పాడాడు. ఈ పాట ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ క్రమంలో ఆస్కార్ వేదికపై తన ప్రదర్శనను ఉద్దేశిస్తూ కాలభైరవ (Kaala Bhairava) ఇటీవల ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ఆ ట్వీట్లో అందరికీ కృతజ్ఞతలు తెలిపిన కాలభైరవ.. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ల పేర్లను మాత్రం ప్రస్తావించలేదు. దాంతో ఆ ఇద్దరు హీరోల అభిమానులు కాలభైరవపై విమర్శలు గుప్పించారు.
ఇంతకూ కాలభైరవ ట్వీట్లో ఏముందంటే.. ‘‘అకాడమీ స్టేజ్ పై లైవ్ లో ‘నాటు నాటు’ పాట పాడినందుకు ఎంతో గర్విస్తున్నా. రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ.. ఇలా వీరందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాకు ఇంతటి విలువైన అవకాశం దక్కేలా సాయపడ్డారు. వాళ్ల శ్రమ, ప్రోత్సాహంవల్లే ఈ పాట ప్రపంచం నలుమూలలకు చేరి అందరితో డ్యాన్స్ చేయించింది. అందుకే ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశం నాకు దక్కింది. ఈ విజయంలో నేనూ భాగమైనందుకు సంతోషిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
అయితే, ఆ ట్వీట్లో ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ల ప్రస్తావన లేకపోవడంపై ఆ ఇద్దరు హీరోల అభిమానులు కాలభైరవపై మండిపడ్డారు. పాట హిట్ కావడానికి ముఖ్య కారకులైన ఎన్టీఆర్, రామ్చరణ్ పేర్లను విస్మరించడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో కాలభైరవ వారికి క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేశారు. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు పాట విజయానికి ఎన్టీఆర్, రామ్ చరణే ప్రధాన కారణం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇచ్చేస్థాయికి నేను ఎదగడానికి మొదటి నుంచి నాకు తోడ్పడిన వారి గురించి ఆ ట్వీట్ లో ప్రస్తావించాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను చేసిన ట్వీట్ తప్పుగా అర్థమైందని తెలుస్తోంది. అందుకు క్షమాపణలు కోరుతున్నా’’ అని ఆ ట్వీట్లో కాలభైరవ పేర్కొన్నారు.