పర్మాన్ జోషి, శ్రియా సరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్’. యామినీ ఫిల్మ్స్ నిర్మాణంలో దర్శకుడు పాపారావు బియ్యాల రూపొందిస్తున్నారు. ఇళయారాజా సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12న హిందీ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత పాపారావు బియ్యాల మాట్లాడుతూ…‘నేను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశాను. మంచి చిత్రాలు రూపొందించాలనే ఆసక్తితో పరిశ్రమకు వచ్చాను. రెండు మూడేండ్లుగా ఈ చిత్రం కోసం పనిచేస్తున్నాము.
పిల్లలను మంచి చదువులు చదివించాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో పిల్లలపై ఎంతో ఒత్తిడి ఉంటున్నది. దీని పర్యవసానాలు ఎలా ఉంటున్నాయి అనే నేపథ్యంతో సినిమాను రూపొందించాము. ఇది సీరియస్ సబ్జెక్ట్ అయినా మ్యూజికల్గా సరళంగా తెరక్కెకించాం. ఇళయరాజా సంగీతం అందుకు ఉపయోగపడింది. నేను అనుకున్న పాత్రల్లో శ్రియా, పర్మాన్ జోషి ఆకట్టుకునేలా నటించారు’ అని అన్నారు. అసోసియేట్ ప్రొడ్యూసర్ యామినీ రావు మాట్లాడుతూ…‘ప్యాషన్తో ఈ చిత్రానికి పనిచేశాం. ఒక నిజమైన మ్యూజికల్ ఫిల్మ్ అనుకోవచ్చు. ఇందులో 11 పాటలుంటాయి. ఇళయరాజా గొప్ప సంగీతాన్ని అందించారు. మా చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘సినిమా మీద ఇష్టముంటే ఏదైనా చేస్తాం అనేందుకు పాపారావు నిదర్శనం. ఆయన ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చారు. పోటీ చదువుల ఈ కాలంలో విద్యార్థులు ఎలా ఒత్తిడికి గురవుతున్నారు అనేది ఈ సినిమాలో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. సీరియస్ సబ్జెక్ట్ అయినా వినోదాత్మకంగా, మ్యూజికల్గా సాగుతుంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.