MSG | మెగాస్టార్ చిరంజీవికి సరైన కథ, సరైన ట్రీట్మెంట్ దొరికితే బాక్సాఫీస్ వద్ద రచ్చ ఎలా ఉంటుందో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (MSG) మరోసారి చూపించింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుని ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందట. ఉత్తర అమెరికాలోనే సుమారు 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు తెలిపింది.
అంతేకాకుండా బుక్ మై షోలో 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని ప్రకటించింది. ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి తెరకెక్కించగా, ఆయన కెరీర్లోనూ, చిరంజీవి కెరీర్లోనూ ఇది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టీమ్ పేర్కొంది. దాదాపు 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలిచింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా థియేటర్లలో ఇంతకాలం విజయవంతంగా రన్ కావడం అరుదైన విషయంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒక రీజినల్ చిత్రానికి బుక్ మై షోలో 3.8 మిలియన్ల టికెట్లు అమ్ముడవడం రికార్డుగా చెప్పబడుతోంది.
ఇదిలా ఉండగా ట్రేడ్ వెబ్సైట్లు పేర్కొంటున్న లెక్కల ప్రకారం ఈ చిత్రం 50 రోజుల్లో సుమారు రూ.306 కోట్ల వసూళ్లు సాధించిందట. ఇందులో ఇండియాలో రూ.219 కోట్ల నెట్, రూ.260 కోట్ల గ్రాస్ ఉండగా, ఓవర్సీస్లో సుమారు రూ.43 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. దాదాపు రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం సుమారు రూ.60–70 కోట్ల లాభాలు అందించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రారంభంలో టాప్ ట్రెండింగ్లో నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం టాప్ 10లో కొనసాగుతూ మంచి వ్యూస్ నమోదు చేస్తోంది. ఓ వైపు ఓటీటీ, మరోవైపు థియేటర్లలో రన్ అవుతూ 50 రోజులు పూర్తి చేసుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మహిళా ప్రేక్షకులు, చిన్నారులు, మెగా అభిమానులను సమానంగా అలరించింది. సరదా కథ, ఎమోషన్, వినోదం కలగలిపిన ఈ చిత్రం చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది.