సినీరంగంలో కొంచెం పేరొందిన కథానాయికలు సహాయ పాత్రల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపరు. అందునా కథానాయకుడి అక్క, చెల్లెలి పాత్రల్లో నటించడానికి ససేమిరా అంటారు. హీరో సోదరి పాత్రల్లో ఒక్కసారి నటిస్తే ఇక భవిష్యత్తులో సదరు హీరో సరసన నాయికగా నటించే అవకాశం ఉండదనే భావనలో ఉంటారు. ఇలాంటి పాతకాలపు సెంటిమెంట్లను తాను పట్టించుకోనని చెప్పింది ‘సీతా రామం’ ఫేమ్ కథానాయిక మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఆమె యుద్ధ నేపథ్యంలో రూపొందిస్తున్న ‘పిప్పా’ అనే చిత్రంలో హీరో ఇషాన్ కట్టర్ సోదరి పాత్రలో నటిస్తున్నది.
ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ‘చెల్లెలి పాత్ర చేస్తున్నావు కాబట్టి ఇక ముందు ఇషాన్ పక్కన నాయికగా నటించలేవు’ అంటూ సోషల్మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ ‘చెల్లెలు, భార్య పాత్రల్లో నాయికలు నటిస్తే అవకాశాలు తగ్గిపోతాయన్నది అపోహ మాత్రమే. రూల్స్ బ్రేక్ చేసినప్పుడే మనమెంటో నిరూపించుకోవచ్చు. ఏ పాత్రలోనైనా ప్రేక్షకుల్ని మెప్పించడమే నిజమైన ప్రతిభగా భావించాలి. కెరీర్లో వెనక్కి తిరిగిచూసుకుంటే ఓ గొప్ప పాత్రను మిస్ అయ్యానని బాధపడొద్దు. ‘పిప్పా’ చిత్రంలో చెల్లెలి పాత్ర నా హృదయానికి ఎంతో దగ్గరైంది’ అని చెప్పింది. బ్రిగేడియర్ మోహతా రాసిన ‘ది బర్నింగ్ చాఫీస్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.