సినీ పరిశ్రమలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒక బహుదూరపు బాటసారి. షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లా సుదీర్ఘ కాలంగా ఆమె ఎదురుచూసిన విజయాలు ఇప్పుడిప్పుడు దక్కుతున్నాయి. పదేళ్ల కిందట టీవీ సీరియల్ ద్వారా పరిచయమైన మృణాల్.. ఇప్పుడు పేరున్న నాయికగా ఎదిగింది. ‘సూపర్ 30’, ‘బాట్లా హౌస్’, ‘తూఫాన్’ వంటి చిత్రాలు బాలీవుడ్లో పేరు తీసుకొచ్చాయి. ఇటీవల ‘సీతారామం’ సినిమా ఘన విజయాన్ని అందించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన సీత పాత్రను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. దీంతో ఆమెకు టాలీవుడ్లోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ‘సీతారామం’ హీరో దుల్కర్ సల్మాన్ జోడీగా ఆమె మరో సినిమా చేయనుందట. త్వరలోనే ఈ సినిమా ప్రకటన రానుందని తెలుస్తున్నది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘ఆంఖ్ మికోలి’, ‘పిప్పా’, ‘గుమ్రా’, ‘పూజా మెరీ జాన్’ వంటి సినిమాల్లో నటిస్తున్నది.