Mouni Roy | బాలీవుడ్ టెలివిజన్ రంగంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్ గత కొన్నేళ్లుగా సినీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టెలివిజన్ సీరియల్స్తో కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘గోల్డ్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘రోమియో అక్బర్ వాల్టర్’ చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం మౌనీ రాయ్ వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె తన భర్త సూరజ్ నంబియార్తో విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపిస్తోంది.
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్లు కొంతకాలం ప్రేమలో ఉన్న తర్వాత 2022 జనవరి 27న గోవాలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. బెంగాలీ, మలయాళ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పెళ్లి అప్పట్లో భారీ చర్చకు దారితీసింది. సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్ఫాలో చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. అంతేకాదు, తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఖాతాల నుంచి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చిన్న మార్పులే పెద్ద చర్చలకు దారి తీస్తుంటాయి. ఈ నేపథ్యంలో మౌనీ చేసిన ఈ పని అభిమానుల్లో అనుమానాలకు కారణమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మలేం” అని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, “ఇద్దరి మధ్య నిజంగానే ఏదో సమస్య ఉన్నట్టే కనిపిస్తోంది” అంటూ మరికొందరు చర్చిస్తున్నారు. మౌనీ రాయ్ తరచూ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు పంచుకునేది. అలాంటిది ఆమె ఒక్కసారిగా ఆ జ్ఞాపకాలను తొలగించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు మౌనీ రాయ్ లేదా సూరజ్ నంబియార్ ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో నిజంగానే వారి దాంపత్య జీవితంలో విభేదాలు వచ్చాయా? లేక ఇది కేవలం సామాజిక మాధ్యమాల ఊహాగానమా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.