భారతీయ వెండితెరపై మునుపెన్నడూ చూడని యాక్షన్ బొనాంజాకు రంగం సిద్ధమవుతోంది. హృతిక్రోషన్ కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ (‘వార్’ ఫేమ్) దర్శకత్వంలో తొలి భారతీయ ఏరియల్ యాక్షన్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. దీపికాపదుకోన్ కథానాయికగా నటించనుంది. ‘ఫైటర్’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాలన్నీ గగనతలంలో యుద్ధ విమానాలు, మిసైల్స్ నడుమ సాగుతాయి. దేశ భద్రతా దళాల పోరాట స్ఫూర్తికి, అసమాన త్యాగానికి, ధైర్యసాహసాలకు వెండితెర దృశ్యరూపంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘నా కలల సినిమా ఇది. విశ్వవ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులు మెచ్చేలా, భారతీయ సినిమా సాంకేతికతను అందరికి పరిచయం చేసేలా ఈ సినిమాను రూపొందించబోతున్నాం’ అన్నారు. గత ఏడాది హృతిక్ రోషన్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేశారు. అయితే చిత్ర కథాంశం గురించి ఎలాంటి వివరాల్ని వెల్లడించలేదు. ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా గురించిన తాజా సమాచారాన్ని వెల్లడించారు. వయాకామ్ 18 స్టూడియో సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్రోషన్ నటించిన ‘వార్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘ఫైటర్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఈ సినిమా తొలిభాగాన్ని ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.